Sunday, October 10, 2010

"ది హిందూ" ఫోటో గ్రాఫర్ గోపాల్ పై కంట్రీ క్లబ్ గూండాల దాడి

"ది హిందూ" ఫోటో గ్రాఫర్ గోపాల్ పై కంట్రీ క్లబ్ గూండాల దాడి

నల్గొండ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం నుంచి ఎంతో కష్టపడి వచ్చి ఫోటో జర్నలిస్టు గా అద్భుతంగా పనిచేస్తున్న 'ది హిందూ' ఫోటో గ్రాఫర్ నగర గోపాల్ పై ఈ సాయంత్రం హైదరాబాద్ లోని కంట్రీ క్లబ్బు సెక్యూరిటీ సిబ్బంది గా చెప్పుకునే గూండాలు దాడి చేసి గాయపరిచారు. 

ఒక నిస్సహాయ యువతిని ఈ గూండాలు విచక్షణారహితంగా కొడుతున్నప్పుడు గోపాల్ చూసి విధి నిర్వహణలో భాగంగా రెండు స్నాప్స్ తీసాడు. దాంతో చెలరేగిపోయిన పది పదిహేను మంది సెక్యురిటీ సిబ్బంది..."మీడియా వాడు రా..." అంటూ తనను క్లబ్బు లోకి బలవంతంగా తీసుకువెళ్ళి ఇష్టమొచ్చినట్లు కొట్టారని, కెమరా గుంజుకున్నారని గోపాల్ చెప్పాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఒక సబ్ ఇన్ స్పెక్టర్  శ్రీనివాస రెడ్డి సహాయంతో గోపాల్ బతికి బైటపడ్డాడు. 

వెంటనే పోలీసులు గోపాల్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ మధ్య తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ...మానసికంగా కుంగి వున్న గోపాల్ పై ఈ దాడి జరిగింది. వృత్తిని దైవంగా భావించే గోపాల్ పై...ఈ తెగ బలిసిన గూండాలు ఇలా దాడి చేయడాన్ని ఈ బ్లాగ్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ గూండాలను వెంటనే అరెస్టు చేయాలని కోరుతున్నాం. 

నల్గొండలో నేను 'ది హిందూ' విలేకరిగా వున్నప్పుడు గోపాల్ ను ఫోటో గ్రాఫర్ గ నియమించాను. అంతకు ముందు అతను హేమ దగ్గర 'zee channel' వీడియో గ్రాఫెర్ గా పనిచేసేవాడు. వలిగొండ రైలు ప్రమాదం అప్పుడు గోపాల్ సాహసంతో తీసిన ఫోటో లు, అతని చలాకీతనం నచ్చి 'ది హిందూ' పత్రిక ప్రధాన సంపాదకులు ఎన్.రామ్ గారు గోపాల్ కు పర్మినెంట్ ఉద్యోగం ఇచ్చారు. ఇక్కడి బ్యూరో చీఫ్ నగేష్ గారు, సిటీ ఎడిటర్ శ్రీనివాస రెడ్డి గారు, ఫోటో సెక్షన్ ఇన్ ఛార్జ్ సతీష్ గోపాల్ కు వెన్ను దన్నుగా వున్నారు.     

"బాగా కొట్టారు. బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి," అని గోపాల్ చెప్పాడు. ఈ దాడి పట్ల ఎన్.రామ్ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి తో మాట్లాడి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాలని రామ్ గారు నగేష్ గారిని కోరినట్లు తెలిసింది.

No comments: